న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా వరుసగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 2.58 లక్షల మంది కరోనా బారినపడ్డారు. అయితే ఆదివారంతో పోల్చితే ఇది 4 శాతం (13,113 కేసులు) తక్కువ. నిన్న 2,71,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్తగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,73,80,253కు చేరాయి. ఇందులో 3,49,33,981 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,56,341 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,86,451 మంది వైరస్ వల్ల మృతిచెందారు. కగా, గత 24 గంటల్లో 1,51,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 385 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా అధికమవుతున్నది. నిన్న 16.28 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.65 శాతానికి చేరిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 158.12 కోట్ల కరోనా వ్యాక్సిడ్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
ఇక కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా అధిమవుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితులు 8209కి చేరారు. ఇందులో 3109 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1738 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 1672, రాజస్థాన్లో 1276, ఢిల్లీలో 549, కర్ణాటకలో 548, కేరళలో 536 చొప్పున కేసులు ఉన్నాయి.