న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేల దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. ఈఏడాది మార్చి 11 తర్వాత తొలిసారిగా మంగళవారం (సెప్టెంబర్ 28) 20 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. నిన్న 18,795 వేల మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కు చేరింది. ఇందులో 3,29,86,180 మంది కరోనా నుంచి బయటపడగా, 4,47,751 మంది బాధితులు మరణించారు. మరో 2,82,520 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,178 మంది కరోనా నుంచి బయటపడగా, 378 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 11,196 కేసులు ఉన్నాయని, 149 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. నిన్న ఒకేరోజు 54,13,332 మందికి కరోనా టీకాలు పంపిణీ చేశామని తెలిపింది. దీంతో ఇప్పటివరకు 87,66,63,490 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. కాగా, సెప్టెంబర్ 28 వరకు దేశంలో 56,74,50,185 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 15,04,713 మందికి పరీక్షలు చేశామని పేర్కొన్నది.