న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. ఇవి ఆదివారం నాటికంటే 12.5 శాతం అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న లక్షా 59 వేల కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులతోపాటు యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 7 లక్షల కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 1,79,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,57,07,727కు పెరిగాయి. ఇందులో 4,83,936 మంది మహమ్మారికి బలవగా, 7,23,619 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 3,45,00,172 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 146 మంది కరోనా వల్ల మరణించారని, 46,569 మంది వైరస్ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రోజువారీ పాజటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకున్నది.
కరోనా కొత్త వేరియంట్ కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 4033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1552 మంది ఒమిక్రాన్ బాధితులు డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 410 కేసులు కొత్తగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1216, రాజస్థాన్లో 529, ఢిల్లీ 513, కర్ణాటక 441, కేరళ 33, గుజరాత్ 236, తమిళనాడు 185, తెలంగాణ 123 చొప్పున కేసులు ఉన్నాయి. మొత్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ వెలుగుచూసింది.