న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుటే తప్ప తగ్గుట లేదన్నట్లుగా దూసుకుపోతున్నాయి. ఒమిక్రాన్ విజృంభణతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా రోజువారీ కేసులు లక్షన్నర దాటాయి. కేసులతోపాటు పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు కూడా అధికమవుతుండటంతో సవ్రత్ర ఆందోళన వ్యక్తవమవుతున్నది. దీంతో రాష్ట్రాలు క్రమంగా కరోనా ఆంక్షలను రెట్టింపు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,55,28,004కు చేరాయి. ఇందులో 3,44,53,603 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 5,90,611 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,83,790 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 40,863 మంది కోలుకోగా, 327 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 1,18,442 పెరిగాయని తెలిపింది.
భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21కి చేరిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 151.58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ కేసులు 3623కు పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 1409 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 1009 కేసులు ఉండగా, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్ 373, కేరళ 204, తమిళనాడు 185, హర్యానా, తెలంగాణలో 123 చొప్పున ఉన్నాయి.