న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13,058 కేసులు నమోదవగా, తాజాగా అవి 14 వేలు దాటాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,08,996కు చేరింది. ఇందులో 1,78,098 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,34,78,247 మంది కోలుకున్నారు. మరో 4,52,651 మంది బాధితులు మరణించారు. కాగా, గత 24 గంటల్లో 19,446 మంది కరోనా నుంచి కోలుకోగా, 197 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7643 కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో మరో 77 మంది చనిపోయారని తెలిపింది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఒకేరోజు 41,36,142 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 99,12,82,283 కరోనా టీకా డోసులును పంపిణీ చేశామని వెల్లడించింది. కాగా, కరోనా రికవరీ రేటు 98.15 శాతానికి చేరిందని, ఇది 2020, మార్చి తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.52 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని, ఇది గతేడాది మార్చి తర్వాత అతి తక్కువ అని పేర్కొంది.