పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా జమ్మూకశ్మీర్పై, ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. జమ్మూ కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా అనవసర వ్యాఖ్యలు చేశారని భారత్ దుయ్యబట్టింది.
పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తూనే వుంటుందని, ఈ అలవాటులో భాగంగానే కశ్మీర్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిందని భారత్ మండిపడింది. ఏ వేదికలపైనైనా, ప్రతి విషయంలోనూ పాక్.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలనే చేస్తుంటుందని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రత్యేక అధికారి రాజేశ్ పరిహార్ మండిపడ్డారు.
యూఎన్ వేదికగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన అసత్యపు, అబద్ధపు వ్యాఖ్యలకు సరైన విధంగా జవాబు ఇవ్వడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని రాజేశ్ పరిహార్ అన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని తాము పదే పదే చెబుతున్నామని, ఇప్పటికీ అదే పునరుద్ఘాటిస్తున్నామని రాజేశ్ పరిహార్ తేల్చి చెప్పారు. ఈ ప్రాంతాలతో సహా మరికొన్ని ప్రాంతాలను పాక్ అక్రమంగా ఆక్రమించుకొందని ఆయన మండిపడ్డారు. ఈ వాస్తవాన్ని ఏ దేశాలు కూడా కాదనలేవని పరిహార్ స్పష్టం చేశారు.
భారత్తో తమ సంబంధాలు క్లిష్టంగా మారాయని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, తాజాగా చేసిన పునర్విభజన లాంటి విషయాలే ఇలా క్లిష్టతరంగా మార్చాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలు చేసిన తరుణంలో భారత్తో చర్చలు జరపాలంటే కష్టతరమే అవుతుందని జర్దారీ అన్నారు.