India Corona | ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,63,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 89 మందికి పాజిటివ్గా తేలింది. మార్చి 27వ తేదీ 2020 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,46,81,233కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,035 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, మూడు రోజులుగా దేశంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం మరణాల సంఖ్య 5,30,726 వద్ద కొనసాగుతోంది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.00 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.