2023 నాటికి దేశ మొత్తం బాకీ153లక్షల కోట్లు
ఎనిమిదేండ్ల గరిష్ఠానికి ఎగసిన ద్రవ్యోల్బణం
జీవితకాల కనిష్ఠానికి రూపాయి విలువ పతనం
డీమానిటైజేషన్తో దివాలా దిశగా దేశం
మోదీ సర్కారు తీరుపై రాజీవ్ మట్ట ధ్వజం
ఆయన ట్వీట్ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నది. ద్రవ్యోల్బణం 8 ఏండ్ల గరిష్ఠానికి చేరడం, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థిక విధానాలపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్కే రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజీవ్ మట్ట ఆదివారం ట్విట్టర్లో ధ్వజమెత్తారు. 2014 మార్చి నాటికి రూ.53 లక్షల కోట్లుగా ఉన్న దేశ రుణ భారాన్ని నరేంద్రమోదీ సర్కారు గత ఎనిమిదేండ్ల నుంచి దారుణంగా పెంచుతున్నదని, దీంతో 2023 నాటికి మొత్తం అప్పులు మరో రూ.100 లక్షల కోట్లు పెరిగి రూ.153 లక్షల కోట్లకు చేరనున్నాయని వివరించారు.
2020 డిసెంబర్ నాటికి దేశ మొత్తం అప్పు.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నిష్పత్తిలో 73.95 శాతానికి చేరిందని, మరోవైపు దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్ డాలర్ల (రూ.46,49,190 కోట్ల)లోపే ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరిగినప్పటికీ దిగుమతులు కూడా 24.21% పెరిగాయని, ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువలో తేడా) 19.76% పెరిగి 18.51 బిలియన్ డాలర్లకు (రూ.1,43,427 కోట్లకు) చేరిందని వెల్లడించారు. దీనితోపాటు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 256 బిలియన్ డాలర్ల (రూ.19,83,654 కోట్ల) విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులు పెరిగితే ఆర్థికంగా దేశం మరింత దిగజారుతుందని పేర్కొన్నారు.
రూ.10.7 లక్షల కోట్ల రుణాలు మాఫీ
దేశీయ బ్యాంకులు 2021 ఆర్థిక సంవత్సరంలో బడా వ్యాపారవేత్తలకు చెందిన రూ.2.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. దీంతో 2014 నుంచి మా ఫీ అయిన మొత్తం రుణాలు రూ.10.7 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో 75% ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. ఈ రుణాలు తీసుకొన్నదెవరో, తిరిగి చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నదెవరో మనందరికీ తెలుసు. 2016 మార్చి నాటికి 8.26 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటును ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుతో నరేంద్రమోదీ దారుణంగా దెబ్బతీశారు. ఫలితంగా జీడీపీ వృద్ధి రేటు 2017లో 6.80 శాతానికి, 2018లో 6.53 శాతానికి, 2019లో 4.04 శాతానికి, 2020లో మైనస్ 7.96 శాతానికి దిగజారింది. దీనంతటికీ కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణమని చెప్పడం సరికాదని రాజీవ్ మట్ట తన ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. రాజీవ్ మట్ట ట్వీట్లను చదివి, రీట్వీట్ చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. దీంతో ఆ ట్వీట్లు నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఆతిథ్య రంగంలో అపార అనుభవం
ఆతిథ్య రంగంలో దాదాపు 40 ఏండ్ల నుంచి కొనసాగుతున్న రాజీవ్ మట్ట.. గతంలో ఎస్కే రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సీఈవోగా పనిచేశారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రెస్టారెంట్లను నడుపుతున్నది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందిన రాజీవ్ మట్ట.. అహ్మదాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా సేవలు అందించారు.