India-Nepal Border | జన్ జడ్ నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ (Nepal) రగిలిపోతోంది. ప్రభుత్వ అవినీతి, అడ్డగోలు నిర్ణయాలపై ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జన్-జడ్ నిరసనకారులు (Gen Z protesters) రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో నేపాల్లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది (High Alert).
నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి, సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు (India-Nepal Border) రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరిఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు పోలీసు పోర్టును ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే, పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూగబోయాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని పానిటాంకి సరిహద్దు పట్టణంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో వస్తువులు సరఫరా చేసే ట్రక్కులు బార్డర్ వద్ద చిక్కుకుపోయాయి.
Also Read..
Nepal | నేపాల్లో కర్ఫ్యూ.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు : సైన్యం