న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరుకుందని, రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని చెప్పారు.
మరోవైపు, ప్రస్తుతానికి విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టును తప్పనిసరి చేసే ఆలోచన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. కరోనా కేసులు, జేఎన్.1 ఉప రకం కేసులు దేశంలో పెరుగుతున్నప్పటికీ బాధితుల్లో చాలా మంది స్వల్ప అనారోగ్యంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపాయి. కొవిడ్ వల్ల దవాఖానల్లో చేరుతున్న వారి రేటులో పెరుగుదల లేదని పేర్కొన్నాయి.