Nepal | నేపాల్లో (Nepal) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ (India) అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.
ప్రజల గొంతు నొక్కేందుకే..!
కమ్యూనికేషన్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వశాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోని కారణంగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలని సెప్టెంబర్ 4న ఓలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జనరేషన్ జెడ్ (Gen Z protests) ఉద్యమాన్ని రగిల్చింది. రెగ్యులేటరీ నిబంధనల మేరకు తాము యాప్ల నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కేందుకు చేపట్టిన సెన్సార్షిప్ చర్యగా యువజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను అడ్డుకుని, సోషల్ మీడియా యాప్లను నిషేధించినప్పటికీ జనరేషన్ జెడ్ ఉద్యమకారులు టిక్టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ల ద్వారా వేలాదిమంది యువజనులను సమీకరించారు.
మైటీఘర్ మండాలా వద్ద మొదలైన ర్యాలీ పార్లమెంట్ భవనం వైపు దూసుకువెళ్లింది. నిరసనకారులు పార్లమెంట్ భవనానికి చేరువ అవుతుండగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహోదగ్రులైన నిరసనకారులు బ్యారికేడ్లను ఛేదించుకుంటూ ముందుకు దూకారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, జలఫిరంగులను ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు.
వెనక్కి తగ్గిన నేపాల్ సర్కార్..
యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల (Social Media) నిషేధంపై నేపాల్ ప్రభుత్వం (Nepal Govt) వెనక్కి తగ్గింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధింస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ‘జనరేషన్ జడ్ డిమాండ్’ (Gen Z Protests) మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు.
Also Read..
Social Media Ban | వెనక్కి తగ్గిన నేపాల్ సర్కార్.. సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత
నేపాల్ రణరంగం.. సోషల్ మీడియా నిషేధంపై భగ్గుమన్న ‘జనరేషన్ జెడ్’
Nepal | సోషల్ మీడియా బ్యాన్పై నేపాల్లో ఆందోళనలు.. ఎనిమిది మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు