FICCI | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిక్కీ (FICCI) 96వ ఏజీఎంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని.. కాబట్టి భారత్ ఆర్థిక ప్రగతి ఇతర దేశాల ఆర్థిక ప్రగతిపై సైతం ప్రభావం చూపడం సహజమేనన్నారు. భారతదేశాన్ని నేటి కాలంలో గ్రోత్ ఇంజిన్ అని పిలవడానికి ఇదే కారణమన్నారు. నేడు ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఒకటిగా ఉందన్నారు. 2027 నాటికి ఎంతోమంది నిపుణులు తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
చైనా అభివృద్ధి వేగం తగ్గుతుందని, భారత్ అభివృద్ధి వేగం పుంజుకోనుందని నివేదిక పేర్కొంది. అంతకుముందు, ఫిక్కీ ఏజీఎంను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమలు సమిష్టిగా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చేరిందని.. దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయన్నారు. ఇన్వెస్టర్లు భారత్కు తరలిరావడం మన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరిగిందని తెలియజేస్తుందన్నారు. విదేశీ బ్యాంకర్లు భారతీయ కరెన్సీని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా పేర్కొంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.