న్యూఢిల్లీ, జూన్ 8: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఏసీ సమీపంలో 38 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి నిర్ణయించింది. ఈ మేరకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) టెండర్లను ఆహ్వానించింది. ప్యాంగాంగ్ సరస్సుకు పశ్చిమ వైపు ఉన్న లుకుంగ్ గ్రామం నుంచి కుడి వైపున ఫింగర్ 1గా పిలిచే ప్రాంతానికి సమీపంలోని చార్ట్సే వరకు ఈ రహదారి నిర్మాణం జరగనున్నది. ఇప్పటివరకు ఇక్కడ సరైన రహదారి లేనందున ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి గంటన్నర సమయం పట్టేది.
ఈ రహదారి నిర్మాణంతో 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. 2020లో భారత్ – చైనా బలగాలు తలపడిన హాట్ స్ప్రింగ్స్ ప్రాంతానికి దూరం కూడా తగ్గనున్నది. సైనిక బలగాలు, వాహనాలు వేగంగా చేరుకోవడానికి ఈ రహదారి దోహదపడనున్నది. ఈ రోడ్డు నిర్మాణానికి గాను బీఆర్వో రూ.154 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించింది. 30 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా హైవేగా ఈ రోడ్డు నిర్మాణం జరగనున్నది.