Fuel Supplies : దేశంలో చమురు కొరత లేదని కేంద్రం ప్రకటించింది. 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ప్రజల్లో ఆందోళన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి ఎలాంటి కొరతా లేదని కేంద్ర పెట్రోలియం, చమురు మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. చమురు సరఫరా లేదంటూ జరుగుతున్నది ఉద్దేశపూర్వక ప్రచారమే అని, ఈ ప్రచారం వల్లే వినియోగదారులు ఆందోళనతో ఎక్కువ కొనుగోళ్లకు పాల్పడుతున్నారని తేల్చింది. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో తగినంత చమురు ఉందని, సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది.
ఎక్కడా, ఎలాంటి ఇబ్బంది లేదని, ధరలు కూడా ఎప్పట్లాగే ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ సరఫరా లేదని జరుగుతున్న ప్రచారంతో జనాలు బంకుల వ్దద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎలాంటి చమురు కొరతా లేదని కేంద్రం తెలిపింది. పెట్రో ఉత్పత్తుల్లో ఇండియా ఐదో స్తానంలో ఉంది. అలాగే, ఆయిల్ రిఫైనరీలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. దేశంలో చమురు తగినంత ఉందని, అలాగే పెట్రో ఉత్పత్తుల్ని 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కూడా కేంద్రం తెలిపింది. దేశంలోని ప్రతి రిఫైనరి 100 శాతం పని చేస్తోందని, ఇండియాలోని కంపెనీలు 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ నిల్వలతో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. సరఫరాలో ఎలాంటి లోటూ లేదని, వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నట్లు ప్రకటించింది.
60 రోజులకు సరిపడా నిల్వలుండగా, యుద్దం ప్రారంభమై 27 రోజులు మాత్రమే అవుతుందని తెలిపింది. ప్రపంచంలో ఎలాంటి పరిణామం ఎదురైనా ప్రతి పౌరుడికి రెండు నెలలకు సరిపడా చమురు దేశంలో అందుబాటులో ఉంటుందని చెప్పింది. దేశీయంగా ఎల్పీజీ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని, ఇక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కూడా పెంచామని పేర్కొంది. ఇప్పటికే అనేక దేశాల నుంచి కార్గోల ద్వారా చమురు దేశానికి రానున్నట్లు తెలిపింది.