న్యూఢిల్లీ: ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి. ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ పాక్, సైన్యాన్ని మోహరిస్తూ చైనా.. సరిహద్దుల్లో (Borders) అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాయి. అయితే ప్రతిగా భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికను సమకూర్చుకుంటూ సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది. ఈ రెండు కీచక దేశాల నుంచి ముప్పు పొంచిఉండటంతో అత్యాధునిక ఆయుధాలను భారత్ తరలిస్తున్నది. ఇందులోభాగంగా భారత వాయుసేన (Air Force) తాజాగా చైనా, పాక్ సరిహద్దుల్లో శత్రు క్షిపణుల అంతుతేల్చే మూడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ స్క్వాడ్రన్లను (S-400 air defence missile squadrons) మోహరించింది.
ఇవి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలుగుతాయి. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఈ క్షిపణి వ్యవస్థ అండగా నిలుస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం.
ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ సమకూర్చుకుంటున్నది. సుమారు రూ.35 వేల కోట్ల వెచ్చించి ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఆ దేశం నుంచి కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు భారత్కు చేరాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరో రెండింటి సరఫరా విషయంలో ఆలస్యమవుతున్నది. దీంతో ఇరు దేశాల అధికారులు తర్వలో సమావేశం కానున్నారు. మిగిలిన రెండింటి విషయమై చర్చించనున్నారు.