భోపాల్: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే తొలి బహిరంగ సభ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో అన్నది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా, ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ మీడియాతో శనివారం మాట్లాడారు. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్లో ప్రతిపాదించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ర్యాలీని రద్దు చేసినట్లు కమల్నాథ్ తెలిపారు. తొలి బహిరంగ సభ కొత్త తేదీ, ప్రాంతం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు, కూటమిలోని ఇతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
కాగా, మధ్యప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘జన ఆక్రోశ్ యాత్ర’ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో సెప్టెంబర్ 19న ఏడు యాత్రలు ప్రారంభమవుతాయని చెప్పారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా 15 రోజుల్లో 11,400 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. పార్టీ ముఖ్య నేత, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్, సీనియర్ నాయకులు ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.