Tamil Nadu | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే అనే అంశాలపై దృష్టి సారించాయి.
అయితే ఇండియా టుడే నిర్వహించిన సర్వే వివరాలు బయటకు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు వెల్లడైంది. 39 లోక్సభ స్థానాలకు గానూ అన్నింటా ఇండియా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నట్లు తెలిపింది. తమిళనాడులో ఎన్డీఏతో పాటు ఇతర పార్టీలు గెలిచే పరిస్థితి లేదని పేర్కొంది.
ఇండియా కూటమికి 47 శాతం ఓట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమికి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సర్వేను 2023, డిసెంబర్ 15 నుంచి 2024, జనవరి 28వ తేదీ వరకు నిర్వహించినట్లు ఇండియా టుడే పేర్కొంది. అయితే ఎన్నికల సమయం వచ్చేనాటికి ఓటింగ్ శాతం, అభ్యర్థుల గెలుపు విషయంలో కొంత తేడా రావొచ్చని తెలిపింది.