విద్యుత్తు కోతలతో విసిగివేసారిన గ్రామస్థులు.. ఏకంగా ఓ సబ్ స్టేషన్కే నిప్పుపెట్టారు.
– బీజేపీపాలిత మధ్యప్రదేశ్లోని దటోడా గ్రామంలో నిరుడు చోటుచేసుకొన్నదీ ఘటన
వేళాపాళాలేకుండా కరెంటు కోతలు, పవర్ హాలిడేలతో విసిగిపోయిన పారిశ్రామికవేత్తలు.. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ అధికారులకు కర్పూర హారతులు ఇచ్చి నిరసన తెలిపారు.
– గత మేలో బీజేపీపాలిత కర్ణాటకలో జరిగిందీ ఘటన
మరికొద్ది రోజుల్లో ఈ ఘటనలు పునరావృతం కావొచ్చు. కారణం.. దేశంలో కరెంటు కటకట మళ్లీ షురూ కానుండటమే!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): దేశంలో కరెంటు కటకట మళ్లీ ముంచుకురానున్నది. వచ్చే నెలలో రాత్రి వేళల్లో పెద్దయెత్తున విద్యుత్తు కోతలు ఉండబోతున్నాయి. కరెంటు కోతలు ఈ ఒక్క వేసవికే పరిమితం కాబోవు.. రానున్న సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి మళ్లీ కొనసాగవచ్చు. ఈ మేరకు ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గనుల నుంచి బొగ్గు నిల్వల వెలికితీత, ప్లాంట్ల నిర్వహణ, విద్యుదుత్పత్తి, డిమాండ్-సరఫరా పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ముందస్తు అవగాహన లేకపోవడమే ఈ విద్యుత్తు కోతలకు కారణంగా తెలుస్తున్నది.
గడిచిన 18 నెలల వ్యవధిలో దేశంలో నాలుగు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే వచ్చే నెలలో దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం 6.4 శాతం ఎక్కువగా ఉండనున్నది. అయితే, పీక్ డిమాండ్ 217 గిగావాట్ల కంటే 1.7 శాతం విద్యుత్తు లోటు ఉండనున్నట్టు నివేదిక అంచనా వేసింది. దీంతో రాత్రిళ్లు కరెంటు కోతలు తప్పవని హెచ్చరించింది. విద్యుత్తు కోతలతో దవాఖానలు, మెట్రో, ఆటో, ఎలక్ట్రానిక్స్, స్టీల్, పేపర్, ఎరువుల తయారీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు గ్రిడ్లకు సంబంధించి కొన్ని పత్రాలను విశ్లేషించినట్టు వివరించింది.
వచ్చే వేసవిలో విద్యుత్తు సరఫరా విషయంలో కొంత సమస్య ఉన్నది. ఇది ఒత్తిడిని కలిగిస్తున్నది.
– గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పేపర్ మిల్లులో ఒక్క నిమిషం కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా కాగితం బ్లాక్ అవుతుంది. వేల రూపాయల నష్టం వాటిల్లుతుంది.
– పీజీ ముకుందన్ నాయర్, ఇండియన్ పేపర్ ఇండస్ట్రీ మాజీ చీఫ్
ఇప్పుడు ఎలా??
కిందటేడాది గరిష్ఠ విద్యుత్తు డిమాండ్-207 గిగావాట్లు
అప్పుడు గరిష్ఠంగా సరఫరా విద్యుత్తు – 187 గిగావాట్లు
వచ్చే నెల అవసరమయ్యే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్-217 గిగావాట్లు
గత మేలో విద్యుత్తు సంక్షోభం ఇలా..
విద్యుత్తు కోతలు ఎదుర్కొన్న రాష్ర్టాలు -16
దేశంలో మొత్తం థర్మల్ ప్లాంట్లు – 269
బొగ్గు కొరతతో ఉత్పత్తిని నిలిపేసిన ప్లాంట్లు – 109
బొగ్గు నిల్వలు కనిష్ఠస్థాయికి చేరిన ప్లాంట్లు – 122
పర్యవేక్షణ గాలికి..
దేశంలోని 70 శాతం విద్యుత్తు అవసరాలను బొగ్గు తీరుస్తున్నది. దీన్ని అర్థం చేసుకోకుండా సోలార్ పవర్పై మొగ్గు చూపిన బీజేపీ ప్రభుత్వం.. ఆ దిశగా కూడా సరైన చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికిప్పుడు అవసరాలను తీరుస్తున్న బొగ్గు, హైడ్రో పవర్ జనరేషన్ను పట్టించుకోవట్లేదు. బొగ్గు వెలికితీత, పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పర్యవేక్షణను గాలికొదిలేసింది.
విద్యుత్తు కోతలు ఉండకుండా చూడండి
వేసవిలో అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ విద్యుత్తు సరఫరా సంస్థలను ఆదేశించారు. విద్యుత్తు సంస్థలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్-మేలో విద్యుత్తుకు డిమాండ్ అధికంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ర్టాలు, కేంద్రాలకు బొగ్గు కేటాయింపులో నిజాయితీ, పారదర్శకంగా వ్యవహరించాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. డిమాండ్-సైప్లె మధ్య అంతరాన్ని అధిగమించడానికి బహుళ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేయాలన్నారు.