న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దులో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా? అంటే.. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు అవునని నిరూపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని వందల మీటర్ల దూరంలోనే గత 12 నెలలుగా రెండు దేశాలు పలు డిఫెన్స్ అవుట్ పోస్టులను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు చూపుతున్నాయి. గల్వాన్ లోయలో చోటుచేసుకొన్న ఘర్షణ నేపథ్యంలో సరిహద్దులపై భారత్, చైనా ఫోకస్ పెట్టాయని, అందులో భాగంగానే ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నది.
ఆ చిత్రాల్లో ఉన్నదేమిటి?
తవాంగ్ సరిహద్దులోని యాంగ్త్సే ప్రాంతంలో భారత సరిహద్దు వెంబడి భారత ఆర్మీ ఆరు ఫ్రంట్లైన్ అవుట్పోస్టులను నిర్మించింది. అందులో కొన్ని భవనాలు, రాళ్ల గోడలు ఉన్నాయి. వాస్తవాధీన రేఖకు 1.5 కిలోమీటర్ పరిధిలోనే ఫార్వర్డ్ బేస్ను కూడా ఏర్పాటు చేసింది. పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. శాటిలైట్ చిత్రాల నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. అయితే, చాలా వరకు రోడ్లు కొట్టుకుపోయి, కొండ చరియలు విరిగిపడిపోయి కనిపించాయి.
చైనా కూడా భారీ నిర్మాణాలు
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కూడా భారీస్థాయిలో నిర్మాణాలు చేపట్టింది. భారత అవుట్పోస్టు నుంచి 150 మీటర్ల దూరంలోనే సరిహద్దు వెంబడి రోడ్డును నిర్మించింది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేసింది. ఈ రోడ్డు చివర ఒక చైనా ఆర్మీ పోస్ట్ కూడా ఉన్నది. నేరుగా సైనికులను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చేలా ప్రాజెక్టులు చేపట్టింది. ఈ రోడ్డు గుండానే చైనా సైనికులు చొచ్చుకొచ్చి భారత సైనికులతో ఘర్షణకు దిగినట్టు తెలుస్తున్నది. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకొని భవిష్యత్తులో మరోసారి చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.