West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. హుగ్లీలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇంట్లోకి చొరబడ్డ టీఎంసీ కార్యకర్తలు బాంబులు, తుపాకులతో విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్వతంత్ర అభ్యర్థి కూతురు చందన సింగ్(20) నుదుటిపై కాల్పులు జరిపారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోల్కతా మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
అయితే స్వతంత్ర అభ్యర్థి పింటూ సింగ్ మొదట టీఎంసీ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ టీఎంసీ పార్టీ అతనికి కాకుండా మరొకరికి టికెట్ ఇచ్చింది. దీంతో పింటూ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలో నిలిచాడు. ఈ క్రమంలోనే టీఎంసీ కార్యకర్తలు పింటూపై దాడి చేశారు. అతని కుటుంబ సభ్యులపై తుపాకులతో దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో కాల్పులు జరపడంతో గోడల్లోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ఆ ఇంట్లో బుల్లెట్లు, బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.