Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర ఏజెన్సీలకు చెందిన సుమారు 10వేల మందికిపైగా ఎర్రకోట వద్ద మోహరించారు. అలాగే ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలను యమునా నదిలో మోహరించారు. దీంతో పాటు డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎర్రకోట నుంచి ఢిల్లీ సరిహద్దుల వరకు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయనున్నారు.
సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతించనున్నారు. అలాగే సరిహద్దుల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఉగ్రవాదులు, దుండగులకు సంబంధిన సమాచారం విషయంలో ఢిల్లీ పోలీసులు పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎర్రకోట దగ్గర పీసీఆర్ వ్యాన్ నిరంతరం గస్తీ తిరుగుతున్నది. ఎన్ఎస్జీ, ఎస్పీజీ, పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసుల సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట వద్ద యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్ని మోహరించారు. దీని సహాయంతో ఎర్రకోట పరిసరాల్లో ఎగిరే ఎలాంటి వస్తువునైనా నియంత్రించనున్నది.
వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీ పోలీసులు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయగా.. వివిధ భద్రతా సంస్థల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఎర్రకోట వద్ద వేదికను భద్రతను పటిష్టం చేసేందుకు ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఇజ్రాయెల్కు చెందిన ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీకి చెందిన కెమెరాలను తొలిసారిగా వినియోగించనున్నారు. ఆయా కెమెరాలు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సహాయంతో అనుమానితులను సైతం గుర్తించే సామర్థ్యం ఉన్నది. మరో వైపు ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతంలో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.