వ్యవసాయ పనులు జోరుగా సాగే సమయంలో పురుష కూలీలకు 10-15 రోజులు పని దొరికితే మళ్లీ దాదాపు నెల వరకు ఖాళీనే. ఈ 15 రోజుల కూలీని ఆ ఖాళీ సమయానికి కలిపితే రోజుకు కూలీ కనీసం రూ.100 కూడా ఉండదని వ్యవసాయార్థికవేత్తలు అంటున్నారు. అనంతరం పని దొరక్కపోతే కుటుంబాలు పస్తులుండటమేనని శ్రామిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: మనదేశంలో ఒకరిద్దరి సంపద రోజూ కొన్ని వేలకోట్లు పెరుగుతున్నది. అదే సమయంలో కోట్లమంది వ్యవసాయ కూలీల ఆదాయం ఏడాది మొత్తంలో ఎంత పెరిగిందో తెలుసా? కేవలం 15 రూపాయలు. అవును.. అక్షరాలా 15 రూపాయలే.. ఇది ఎవరో చెప్పిన లెక్కకాదు. కేంద్ర కార్మికశాఖ పరిధిలోని లేబర్ బ్యూరో తేల్చిన లెక్క. దేశంలో సంపదంతా ఎవరివద్ద పోగుపడుతున్నదో.. ఎవరు మూడుపూటలా తిండికి కూడా నోచుకోకుండా పస్తులుంటున్నారో చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ లేదు.
2017 నుంచి వ్యవసాయ కూలీల ఆదాయం ఎంత పెరిగిందన్నదానిపై లేబర్ బ్యూరో సేకరించిన గణాంకాల్లో ఈ చేదు నిజం బయటపడింది. ఈ లెక్కలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయటపెట్టింది. 2017 నుంచి వ్యవసాయ కూలీల ఆదాయం ఏటా ఆరుశాతం.. అంటే రూ.15 పెరిగింది. మొత్తంగా ఐదేండ్లలో 29 శాతం.. అంటే అక్షరాలా రూ.75. ఈ లెక్కలు కూడా పురుష కూలీలవే.. సాధారణంగా మనదేశంలో పురుష కూలీలకంటే మహిళా కూలీలకు కూలీ తక్కువగా ఉంటుంది. అంటే మహిళా కూలీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నమాట.
కష్టార్జితాన్ని మింగిన ద్రవ్యోల్బణం
మనదేశంలో పురుష వ్యవసాయ కూలీలు 15 కోట్లకుపైగా ఉంటారు. దేశంలో అత్యంత పేదలు వీరే. అన్నివర్గాలకంటే వీరి ఆదాయమే అతి తక్కువ. వీరికి ఏడాదంతా పనికూడా ఉండదు. సీజన్ను బట్టా ఏటా మూడునాలుగు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. 2017 నుంచి పురుష వ్యవసాయ కూలీల ఆదాయం 29 శాతం పెరిగితే.. ఇదే కాలంలో ద్రవ్యోల్బణం 28 శాతం పెరిగింది. అంటే కూలీలకు పెరిగిన ఆదాయానికి దాదాపు సమానంగా నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. 2017 సెప్టెంబర్లో వ్యవసాయ కూలీ సగటు దినసరి కూలీ రూ.266 ఉండగా, 2022 ఆగస్టులో 342కు పెరిగింది. 2017 సెప్టెంబర్లో ధరల సూచీ 899 పాయింట్లు ఉండగా, 2022 ఆగస్టులో 1,152కు పెరిగింది.
మహిళా కూలీల పరిస్థితి మరీ దారుణం
పురుష కూలీల పరిస్థితే ఇలా ఉందం టే.. మహిళా కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని నివేదికలో వెల్లడైంది. పురుష కూలీలు గత ఆగస్టులో రోజుకు రూ.343 కూలీ సంపాదించగా, మహిళా కూలీలకు రూ.271 కూలీ మాత్రమే లభించింది. మనదేశంలో అత్యధికమంది మహిళలు పనిచేసే రంగం వ్యవసాయమే. పురుషులకంటే కూడా వ్యవసాయ కూలీల్లో మహిళలే అత్యధికం. వ్యవసాయ పనులు లేని సమయంలో పురుష కూలీలు సమీప పట్టణాల్లో ప్లంబర్లు, కార్పెంటర్లు, డ్రైవింగ్ తదితర పనులు చేసుకోగలుగుతారు. మహిళలకు ఆ అవకాశం కూడా లేదు.
కూలీలోనూ కులవివక్ష
కూలీ విషయంలో దేశంలో కుల వివక్ష తీవ్రంగా ఉన్నదని నివేదికలో బయటపడింది. ఈ ఆగస్టులో తీసిన లెక్కల ప్రకారం ఎస్సీ పురుష కూలీలు రోజుకు సగటున రూ.290 కూలీ సంపాదించగా, ఎస్సీ మహిళా కూలీలు రూ.269 మాత్రమే సంపాదించారు. వ్యవసాయ కూలీల్లో మనదేశంలో అత్యధికమంది ఎస్సీలేనని గణాంకాలు చెప్తున్నాయి.
కేంద్రం నిర్వాకమే
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అత్యధికమంది పేదలను వదిలి పిడికెడు మంది కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తల చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికవ్యవస్థను రాత్రికిరాత్రి అమాంతం పెంచేయాలన్న అసంబద్ధ ఆలోచనలతో బీజేపీ సర్కారు పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. భారీగా ఉద్యోగాలు, సంపద సృష్టిస్తారని ఆశలు పెట్టుకొని కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా కోట్ల మంది పేదలను పట్టించుకోకుండా కార్పొరేట్లకు లక్షలకోట్ల ఉద్దీపణలు అందించింది.
దీనికి అదనంగా ప్రతి వస్తువుపై పన్నులేయాలన్న అత్యుత్సాహం ప్రదర్శించటంతో వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం చోటుచేసుకోవటంతో కంపెనీలు కొత్తపెట్టుబడులు పెట్టడం మానేశాయి. దీంతో ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి అన్న మోదీ సర్కారు కల నీటిమీద రాతలా చెదిరిపోయింది. ఇలా రెండురకాలుగా దెబ్బ పడటంతో కోట్లమంది ప్రజలు తిండికి కూడా తిప్పలు పడాల్సిన దుస్థితి దాపురించిందని ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.