న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ను 52 శాతానికి పెంచాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓసీబీఎస్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని కోరింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ సంఘం అధ్యక్షుడు కిరణ్కుమార్ లేఖ రాశారు. 1931 తర్వాత దేశంలో పూర్తిస్థాయిలో కులగణన జరుగలేదని లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి, కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇదో గొప్ప అవకాశమని తెలిపారు.
ఓబీసీలకు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, సమర్థ విధానపర నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడానికి ఈ డాటా ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ రామ్గోపాల్రావు కమిటీ నివేదికను తిరస్కరించాలని, ఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు స్థానం కల్పించి బలోపేతం చేయాలని కోరారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల వివక్షను అంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేయాలని కోరారు.