తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. మంగళవారం కూడా కొత్తగా 172 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1026కు పెరిగింది. అందులో 111 మందిలో సింప్టమ్స్ ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు పెరగడంతో కేరళ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాలను ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మహమ్మారి ఎక్కువ మందికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కాగా, దేశవ్యాప్తంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ప్రధాని మోదీ ఇవాళ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.