Parliament | న్యూఢిల్లీ, మే 27: ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే పార్లమెంట్ నూతన భవనం విషయంలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి వివాదాస్పదమైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రతిపక్షాల నిర్ణయం సరైందే: శరద్ పవార్
‘ప్రతి ఏటా పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ఓ భాగం. ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు, ఎంపీలతో కేంద్రం మాట్లాడలేదు. వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోలేదు. అందువల్లే ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశాయి. వారి నిర్ణయం సరైందే’ అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు.
కొత్త భవనం అవసరం లేదు: నితీశ్కుమార్
‘భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం లేనివారు దేశ చరిత్రను మార్చుతున్నారు. అందులో భాగంగానే నూతన పార్లమెంట్ భవనం కట్టారు. కొత్త భవనం కట్టాల్సిన అవసరమే లేదు. కొత్త చరిత్రను రాయటం కోసమే కొత్త పార్లమెంట్ కట్టారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా వేడుక నిర్వహించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది’ అని బీహార్ సీఎం నితీశ్ అన్నారు.
అధిక ధరలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు: గులాంనబీ ఆజాద్
‘పార్లమెంట్ నూతన భవనం రాష్ట్రపతి ప్రారంభిస్తారా? ప్రధాని ప్రారంభిస్తారా? అన్నది ప్రజలకు అక్కర్లేదు. దీనిపై ప్రజలు ఆందోళన చెందటం లేదు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం..అనేవే ఎక్కువగా ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి’ అని మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పారు.
రాష్టప్రతిని ఎందుకు ఆహ్వానించలేదు: కమల్హాసన్
పార్లమెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రధాని మోదీని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ ప్రశ్నించారు. ‘చరిత్రాత్మక ఘట్టంలో రాష్ట్రపతి లేకపోవటం నాకు అర్థం కావటం లేదు. దేశం యావత్తు గర్వించాల్సిన ఈవేళ రాజకీయ వివాదం ఏర్పడటానికి కేంద్రం తీరే కారణం’ అని అన్నారు.
బాయ్కాట్ చేసిన పార్టీలు: కాంగ్రెస్, డీఎంకే, ఉద్ధవ్వర్గం శివసేన, ఆప్, ఎస్పీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్-మణి, విధుత్లాయి కచ్చి, ఆర్డీఎల్, టీఎంసీ, జనతాదళ్ (యు), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్సీ, ఆర్ఎస్పీ, ఎండీఎంకే, ఏఐఎంఐఎం.
హాజరవుతున్న పార్టీలు: బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్పీపీ-మేఘాలయ, ఎన్డీపీపీ , సిక్కిం క్రాంతికారి, ఏఐడీఎంకే, ఏజేఎస్యూ, ఆర్పీఐ(అథవాలే), మిజో నేషనల్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే, అప్నాదళ్, ఏజీపీ, ఎన్డీయే కూటమిలో లేని పార్టీలు..లోక్జనశక్తి(పాశ్వాన్), బీజేడీ, బీఎస్పీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ.