Vande Bharat Express | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వందే భారత్ రైలును ప్రధాని మోదీ ఇప్పటివరకూ 25 సార్లు ప్రారంభించారు. అట్టహాస ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రైల్వే శాఖ కోట్లు ఖర్చు పెడుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైలును ప్రారంభించినప్పటికీ, ఈ ఖర్చు ఆగట్లేదు. ఆర్టీఐ కార్యకర్త అజయ్ బోస్ దరఖాస్తుతో ఖర్చు విషయాలు బయటపడ్డాయి. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన నాలుగు వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవాలకు రూ. 5,60,87,237 ఖర్చు అయినట్టు రైల్వేశాఖ పేర్కొన్నది. పూరీ-హౌరా మధ్య నడిచే వందే భారత్ను మే 18న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమానికి రూ.2.5 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ప్రజాధనాన్ని రైల్వేశాఖ ఖర్చు చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
291 మంది బతికేవారుగా!
ఒడిశా రైలు ప్రమాదంలో 291 మంది మరణించారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జంబ్లింగ్ ట్రాక్ ఉన్న 4 కిలోమీటర్ల ఈ కీలక ప్రాంతంలో సిగ్నలింగ్ అప్గ్రెడేషన్, కవచ్ ఏర్పాటుకు రూ.3 కోట్లు కూడా ఖర్చు కాదని చెబుతున్నారు. ‘వందే భారత్’ ఒక్కో రైలు ప్రారంభోత్సవానికే కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్రం.. బాలాసోర్లో రూ. 3 కోట్లతో సిగ్నలింగ్ వ్యవస్థను నవీకరించినట్లయితే, 291 ప్రాణాలు బలయ్యేవి కావని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఏ రైలు ప్రొగ్రామ్కు ఎంత ఖర్చు?
రైలు ఖర్చు
పురీ-హౌరా వందేభారత్ రూ. 2.5 కోట్లు
తిరువనంతపురం-కాసర్గాడ్ వందేభారత్ రూ. 1.48 కోట్లు
చెన్నై-కొయంబత్తూర్ వందేభారత్ రూ. 1.14 కోట్లు
అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ వందేభారత్ రూ. 48.26 లక్షలు