న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని బారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మధ్య శీతాకాలం సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని శుక్రవారం పేర్కొన్నది. దేశంలోని ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత కూడా సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. శీతాకాలం వాతావరణంపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహపాత్రా మీడియాతో మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలోని మధ్య, వాయువ్య రీజియన్లోని కొన్ని రీజియన్లు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ కనిష్ఠం, గరిష్ఠం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. కాగా, గత కొన్ని నెలలుగా దాదాపు దేశమంతా సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి నైరుతి రుతు పవనాలపై ఎల్నినో ప్రభావం పడింది. పలు రాష్ర్టాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.