కోల్కతా : పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఓట్ షేర్లో సుమారు 45 శాతం ఓట్లు ఆ పార్టీకి పోలైనట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 294 స్థానాలు ఉన్న బెంగాల్లో.. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం 194 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ 94 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. దీదీ కంచుకోటను కమలం అభిమానులు బ్రేక్ చేశారు. ఈసారి భారీ ఎత్తున హిందుత్వ ఓటర్లు తమ సత్తా చాటినట్లు ఓట్షేర్ ద్వారా తెలుస్తోంది. బెంగాల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం.. బీజేపీకి 45.07 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఓట్ షేర్లో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది. ఆ పార్టీకి కూడా భారీగానే ఓట్లు పడ్డాయి. ఓట్ షేర్లో తృణమూల్కు 40.93 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఓట్ షేర్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
బెంగాల్లో ఈసారి ఓటర్లు భారీగా పోటెత్తారు. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో 92.47 శాతం ఓటింగ్ జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం చరిత్రాత్మకమే. తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం, రెండో దశ ఎన్నికల్లో 91.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే రెండు కలిపి సగటున బెంగాల్లో 92 శాతం ఓట్లు పోలయ్యాయి. భారీగా ఓటింగ్ జరిగిన నేపథ్యంలో.. బీజేపీ, తృణామూల్ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నది. కానీ ఓట్ షేర్లో మాత్రం బీజేపీ కాస్త ముందంజలో ఉన్నది.