BJP | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చిన బీజేపీకి రెండో దశలోనూ అడియాసలే మిగిలాయా? పోలింగ్ శాతం తగ్గడం, ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న రాష్ర్టాల్లో మరింత తగ్గడం కమలనాథులను కలవరపాటుకు గురి చేస్తున్నదా? 2019లో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవడం కూడా ఆ పార్టీకి కష్టమేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండో దశలో భాగంగా 13 రాష్ర్టాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ 88 స్థానాల్లో గత ఎన్నికల్లో 63 చోట్ల ఎన్డీయే గెలిచింది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఈసారి బీజేపీకి ఈ స్థానాల్లో భారీగా కోత పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. 370 సీట్లు సొంతంగా సాధిస్తామని చెప్తున్న బీజేపీకి రెండో దశ మింగుడు పడకుండా ఉన్నట్టు కనిపిస్తున్నది.
ఓటింగ్ సరళితో బీజేపీలో కలవరం
దేశంలో మోదీ వేవ్ ఉన్నట్టు బీజేపీ కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నది. ఏ ఎన్నికల్లో అయినా వేవ్ ఉంటే ఓటింగ్ పెరుగుతుంది. అయితే, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో ఈ 88 సీట్లలోని 85 సీట్లలో 69.64 శాతం పోలింగ్ జరగగా ఈసారి 63.5 శాతం మాత్రమే నమోదైంది. ఓటింగ్ శాతం తగ్గడం ఒక అంశమైతే.. బీజేపీకి పట్టున్న ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ర్టాల్లో మరింత తగ్గడం ఆ పార్టీని కలవరపాటుకు గురి చేసే అంశం. రెండో విడతలో యూపీలోని 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 54.85 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇవే స్థానాలకు 2019లో 62 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్న మథురలో గత ఎన్నికలకు ఇప్పటికి ఓటింగ్ 12 శాతం తగ్గింది. ఘజియాబాద్లో 6 శాతం తగ్గింది. గత ఎన్నికల్లో ఎన్డీఏ దాదాపుగా క్లీన్స్వీప్ చేసిన మహారాష్ట్రలో 59.6(2019లో 63 శాతం), బీహార్లో 57 శాతం(2019లో 63 శాతం), రాజస్థాన్లో 64.07 శాతం(2029లో 68 శాతం) నమోదైంది. మరోవైపు బీజేపీకి పెద్దగా పట్టులేని కేరళ, ఈశాన్య రాష్ర్టాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం బీజేపీ వ్యతిరేక పవనాలకు సూచిక అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భావోద్వేగాలు పని చేయడం లేదా?
ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందనే అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు పలు కారణాలను చెప్తున్నారు. ముఖ్యంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరేలా చేసే భావోద్వేగ అంశాలేవీ ఈ ఎన్నికల్లో పని చేయడం లేదనేది వారి మాట. తద్వారా రామమందిర నిర్మాణం, మతపరమైన అంశాలను తెరపైకి తేవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నట్టు కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 370 సాధిస్తామని చెప్తున్నది. ఇది జరగాలంటే బీజేపీకి చాలా అనుకూలత ఉండాలి. ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటేయాలి. కానీ, ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేసేందుకు సిద్ధంగా లేరని, పెరిగిన ధరలు, నిరుద్యోగం, 10 ఏండ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఓటింగ్ తగ్గడానికి కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. 102 స్థానాలకు తొలి దఫా పోలింగ్లోనూ గత ఎన్నికలతో పోల్చితే దాదాపు నాలుగు శాతం ఓటింగ్ తగ్గింది.
బీజేపీ సీట్ల సంఖ్యకు కోత
రెండో దశలో ఎన్నికలు జరిగిన 88 స్థానాల్లో కేరళలోని 20 స్థానాల్లో నాలుగైదు స్థానాలు మినహా ఎక్కడా బీజేపీ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఇక, గత ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఈసారి బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. రైతుల్లో వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చు. ఇక, గత ఎన్నికల్లో ప్రతిపక్షాల విచ్ఛిన్నం బీజేపీకి కలిసిరాగా ఈసారి ప్రతిపక్షాలు కొంతవరకు ఐక్యంగా పోరాడుతుండటం, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీల జోష్ కనిపిస్తుండటంతో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు బీజేపీకి మద్దతుగా నిలిచిన రాజ్పుత్లు, జాట్లు, మరాఠాలు ఈసారి దూరమయ్యారనే అంచనాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కలిసి బీజేపీ విజయావకాశాలకు గండి కొడుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో దశలో ఎన్నికలు జరిగిన 88 సీట్లలో గత ఎన్నికల్లో గెలిచిన 63 సీట్ల కంటే ఈసారి లెక్క తగ్గే అవకాశముందని అంచనా.