Air India | ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ882 విమానంలో చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడాడని, క్రూ సిబ్బందిలో ఒకరిపై దాడికి పాల్పడ్డాడని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. విమానం ఢిల్లీకి చేరిన తర్వాత సైతం అదే ప్రవర్తనను కొనసాగించాడని పేర్కొన్నారు. ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు వివరించారు. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏకు నివేదించినట్లు తెలిపారు.
ప్రయాణికుడి వికృత ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత సిబ్బందికి అన్నివిధాలా సాయం అందిస్తామని ఎయిర్లైన్స్ తెలిపింది. అయితే, సదరు ప్రయాణికుడి వివరాలను మాత్రం ఎయిర్ ఇండియా తెలుపలేదు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఏప్రిల్ 10న ఢిల్లీ – లండన్ విమానంలో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళా క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై రెండేళ్ల పాటు ప్రయాణించకుండా నిషేధం విధించింది. క్యాబిన్ క్రూ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తిని పంజాబ్కు చెందిన జకీరత్ సింగ్ పడ్డాగా గుర్తించారు.