Poonch Attack | న్యూఢిల్లీ, డిసెంబర్ 22: గురువారం జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్-చైనా పన్నాగమని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి పెంపొందించడం ద్వారా భారత సైన్యంపై ఒత్తిడి తేవాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నాని.. తద్వారా సైన్యాన్ని లఢక్ సరిహద్దు నుంచి కశ్మీర్కు తిరిగి వెళ్లేలా చేయాలనేది వారి ప్రణాళిక అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. 2020లో గల్వాన్ సరిహద్దు ఘర్షణ తర్వాత భారత బలగాలను కశ్మీర్కు వెనక్కి పంపాలని చైనా ప్రయత్నిస్తున్నది.
ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ఉత్తర ప్రాంతంలో భారత్ను ఒత్తిడికి గురి చేసేందుకు పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేయాలని చైనా, పాకిస్థాన్ భావిస్తున్నాయి. 2003 నుంచి పూంఛ్-రాజౌరీ జిల్లాల్లో ఉగ్ర దాడులు ఎక్కువయ్యాయని.. ఆనాటి నుంచి ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాగుడు మూతలు ఆడుతున్నారని రక్షణ రంగ నిపుణుడు కర్నల్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి భారత సైన్యం అదనపు బలగాలను పంపింది. తాజా ఆపరేషన్లలో 20 మంది ఉగ్రవాదులను ఏరివేసింది. 2019లో 370 అధికరణ రద్దు చేయడంతో పాక్, చైనా నిరాశ, కోపంతో ఉన్నాయని.. అందుకే అవి కశ్మీర్లో ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్, రాజౌరీల్లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని విశ్రాంత కర్నల్ అజయ్ కొతియాల్ అన్నారు.