ఐజ్వాల్, అక్టోబర్ 9: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్నది. ప్రస్తుత సీఎం జోరంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. గతంలో నాలుగుసార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన లల్దుహౌమా నేతృత్వంలోని జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) పార్టీ దెబ్బతో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో 2018 ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ను కూలదోసి, 37.7 శాతం ఓట్లతో 26 స్థానాలు గెలుచుకొన్నది. కాంగ్రెస్ పార్టీ 30 శాతం ఓట్లతో కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్న జెడ్పీఎం కాంగ్రెస్ కంటే తక్కువగా 22.9 ఓట్ల శాతం వచ్చినప్పటికీ, 8 సీట్లు సాధించింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గణనీయ ప్రభావం చూపింది.
జడ్పీఎంతో రాజకీయాల సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. ఓవైపు జో శరణార్థుల్లో ఎంఎన్ఎఫ్కు ఆదరణ ఉండగా.. మరోవైపు గత కొన్నేండ్లుగా జెడ్పీఎం పట్టణ ప్రాంతాల్లో బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పట్టణంగా ఉన్న లుంగ్లేయ్ మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీఎం 49 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో తన ఎదుగుదలను మరోసారి స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్ 29.4 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలువగా, 20 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ చివరన నిలిచింది. కాగా, ఎంఎన్ఎఫ్కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయావకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి పాలసీ(ఎస్ఈడీపీ) కింద సీఎం జోరంతంగా ప్రభుత్వం ప్రజలకు పలురూపాల్లో అందించిన అర్థిక సాయం, శరణార్థుల విషయంలో వ్యవహరించిన తీరు అందుకు సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.