న్యూఢిల్లీ, జూన్ 20: 2017లో హోలీ పండుగ సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ‘హరిత’ తీర్పు వెలువరించింది. నిందితులు తమ నివాసాలకు సమీపంలో 10 రకాల దేశీయ జాతి మొక్కలు నాటి పరిరక్షించాలని, దశాబ్ద కాలం పాటు ప్రతి ఏడాది వాటి పెరుగుదల పరిస్థితిపై చెట్టుతో దిగిన ఫొటోలతో సహా ఢిల్లీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఈ కేసులో రెండు పక్షాలు రాజీకి వచ్చిన నేపథ్యంలో.. న్యాయమూర్తి జస్టిస్ జస్మీత్ సింగ్ ఎఫ్ఐఆర్ను ఇటీవల కొట్టివేస్తూ, పైవిధంగా తీర్పు వెలువరించారు. 4 వారాల్లోగా హార్టికల్చర్ అధికారులను సంప్రదించి ఏ ప్రాంతంలో మొక్కలు నాటాలో తెలపాలని కేసు దర్యాప్తు అధికారికి ఆదేశించింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తికి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.