న్యూఢిల్లీ, ఆగస్టు 20: నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ లేదా ఈడీ మరో 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. అయితే తాను దీనికి భయపడబోనని పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల పోరు బీజేపీ, ఆప్ మధ్యనే ఉంటుందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ జాతీయ నేతగా ఎదగకుండా అడ్డుకునేందుకు బీజేపీ స్క్రిప్ట్ తయారు చేసిందని దుయ్యబట్టారు. ఢిల్లీ నూతన ఎక్సైజ్ పాలసీలో అవకతవకల కేసులో సీబీఐ శుక్రవారం సిసోడియా ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.