CJI Chandrachud | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేలుపెట్టరాదని స్పష్టంచేసింది. మహారాష్ట్రంలో శివసేనను చీల్చి ఏక్నాథ్షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వ్యవహారంలో ఆ రాష్ట్ర గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా గవర్నర్ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ‘మనది ద్విపార్టీ వ్యవస్థ కాదు.
బహుళపార్టీ వ్యవస్థ. అంటే మనం రాజకీయ కూటముల యుగంలో ఉన్నాం. ఈ కూటములు రెండు రకాలు. ఒకటి ఎన్నికలకు ముందు ఏర్పడే ముందస్తు కూటమి. ఇది నిజమైన కూటమి. రెండోది ఎన్నికల తర్వాత ఏర్పడే కూటమి. ఇది అవకాశవాద కూటమి. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి. అందువల్ల ఓటర్ల వద్దకు వ్యక్తిగతంగా కాకుండా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని తీసుకొని వెళ్లినట్టే లెక్క. ఇప్పుడు మనం హార్స్ ట్రేడింగ్ అనే పదాన్ని వింటున్నాం. పదవి కోల్పోయిన నాయకుడు (ఉద్ధవ్ ఠాక్రే) ఎన్నికల్లో ఎవరితో అయితే పోరాడారో ఎన్నికల తర్వాత వారితోనే (కాంగ్రెస్, ఎన్సీపీ) కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ పార్టీలను ఓటర్లు తిరస్కరించారు’ అని వాదించారు.
సొలిసిటర్ జనరల్ వాదనను సీజేఐ తిరస్కరించారు. ‘గవర్నర్ కార్యాలయం నుంచి ఇలాంటి ప్రకటన రాకూడదు. గవర్నర్ ఇలా ఎలా మాట్లాడుతారు? ప్రభుత్వ ఏర్పాటుపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సభలో విశ్వాసం నిరూపించుకోవాలని కోరటమే గవర్నర్ పని. గవర్నర్ రాజకీయ వ్యవహారాల్లోకి వెళ్లకూడదనేదే మా అభిప్రాయం. ఈ కేసులో అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నమంరుబియా (2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేసు) కేసును ఆధారంగా తీసుకొంటే మహారాష్ట్రలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ప్రజాప్రతినిధులు వెళ్లటం సమంజసంగానే కనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే పార్టీ సభ్యుల విశ్వాసం కోల్పోయిన నాయకుడు పదవి నుంచి తప్పుకోవాల్సిందే. మనం నమంరుబియా కేసు తీర్పునకు వ్యతిరేకంగా వెళ్తే.. పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధుల సమూహపు విశ్వాసాన్ని నాయకుడు కోల్పోయిన సందర్భంలో కూడా యథాతథ పరిస్థితినే కొనసాగించాల్సి ఉంటుంది. ఇందులో మీరు దేనిని సమర్థిస్తారు. ఈ రెండు విధానాలూ రాజకీయాల్లో సీరియస్ పరిణామాలకు దారితీసేవే. ఈ రెండు పద్ధతులూ ఆమోదనీయమైనవి కావు’ అని సీజేఐ స్పష్టంచేశారు.
అరుణాచల్లో 2015లో నబం తుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ చట్టవ్యతిరేకంగా కూల్చివేసిన విధానంపై 2016లో సుప్రీం ఇచ్చిన తీర్పే నమంరుబియా కేసుగా స్థిరపడింది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెండింగ్లో ఉన్న సమయంలో, సభలోని కొందరు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయటం చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అదే సమయంలో గవర్నర్ విచక్షణాధికారాలకు పరిమితులు ఉన్నాయని స్పష్టంచేసింది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రిమండలిని సంప్రదించాల్సిందేనని పేర్కొన్నది. గవర్నర్ నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని తేల్చిచెప్పింది. మహారాష్ట్రలోనూ షిండే వర్గ ఎమ్మెల్యేలపై డిఫ్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేసిన సమయంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెండింగ్లో ఉన్నది.