Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మరో వైపు ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటాన్ని తొలగించకుండా అలానే ఉంచారు. ఇప్పుడు స్పీకర్ చైర్కు కుడి వైపున గాంధీ, ఎడమవైపు అంబేద్కర్ చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి.
ఇక నెహ్రూ చిత్రం తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ ఫోటోను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అబ్బాస్ హాఫీజ్ ట్వీట్ చేశారు.
బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడటం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా అసెంబ్లీలో వేలాడదీసిన దేశ తొలి ప్రధాని చిత్రపటాన్ని తొలగించడం బీజేపీ యొక్క మెంటాలిటీని తెలియజేస్తుందన్నారు. వీలైనంత త్వరగా మాజీ ప్రధాని ఫోటోను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఆ పని చేస్తామని అబ్బాస్ తెలిపారు.