బెంగళూర్ : కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరంగా చేపట్టాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు చామరాజ్నగర్ జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. కొవిడ్-19 టీకా తీసుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని చామరాజనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎంఆర్ రవి బుధవారం వెల్లడించారు.
రేషన్ తీసుకోవాలంటే బీపీఎల్ దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ కార్డుదారులు విధిగా కరోనా టీకా వేయించుకోవాలనే నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని ఆయన చెప్పారు. ఇక టీకా తీసుకోని వారికి పింఛన్ రాదని కూడా తాము ప్రచారం చేస్తున్నామని జిల్లాలో ఉన్న 2.20 లక్షల పించనుదారులకు టీకా తీసుకుంటేనే పించన్ ఇవ్వాలని బ్యాంకులకు కూడా సూచనలు చేశామని ఆయన తెలిపారు.
జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అయితే అధికారుల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొవిడ్-19 టీకాలు తీసుకోని వారికి పించన్, రేషన్ నిరాకరించే అధికారం జిల్లా అధికారులకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.