లక్నో: ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. గోరఖ్పూర్ నార్త్ ఈస్టర్న్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న కేసీ జోషి ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఏడు లక్షలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కాగా, దీని గురించి ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే అధికారి కేసీ జోషి రూ.3 లక్షలు లంచంగా తీసుకుంటుండగా మాటు వేసిన సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయనకు చెందిన గోరఖ్పూర్, నోయిడాలోని కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలతోపాటు రూ.2.61 కోట్ల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.