పాట్నా : బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ స్థలంలో కొత్త అంబులెన్స్లు నిరూపయోగంగా ఉండటంపై ఆ రాష్ట్రానికి చెందిన జన అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సరన్ జిల్లా మాధౌరా గ్రామంలోని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ స్థలం వద్దకు తన అనుచరులతో కలిసి ఆయన వెళ్లారు. ఎంపీలాడ్స్ నిధులతో సమకూర్చిన అంబులెన్స్లను అక్కడ కవర్లతో కప్పి ఉంచగా వాటిని తొలగించి మీడియాకు చూపారు. కరోనా సంక్షోభం సమయంలో అంబులెన్స్లను వినియోగించకుండా ఇక్కడ ఉంచడంలో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
మరోవైపు దీనిపై బీజేపీ ఎంపీ ప్రతాప్ స్పందించారు. అక్కడ వందల సంఖ్యలో అంబులెన్స్లు లేవని కేవలం 20 మాత్రమే ఉన్నాయని తెలిపారు. డ్రైవర్లు అందుబాటులో లేక వినియోగంలోకి తీసుకురాలేదని చెప్పారు. ఒక వేళ పప్పు యాదవ్ డ్రైవర్లను సమకూర్చగలిగితే వాటిని తీసుకెళ్లవచ్చని అన్నారు.
దీనిపై పప్పు యాదవ్ శనివారం స్పందించారు. డ్రైవింగ్ లెసెన్స్ కలిగి ఉన్న కొందరు వ్యక్తులను ఆయన చూపారు. అంబులెన్స్లను నడిపేందుకు ఈ డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.