లక్నో : యూపీలో రాజకీయ నేతపై ఎద్దు దాడి చేయడం కలకలం రేపింది. లఖింపూర్ ఖేరిలో ఎస్పీ నేత జహిద్ అలీ ఖాన్పై ఎద్దు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ ప్రతినిధి జహిద్ అలీ ఖాన్ బుధవారం రాత్రి పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసేందుకు వెళుతుండగా ఆయన మీదుకు ఎద్దు దూసుకువచ్చింది.
ఎద్దు దాడిలో ఆయన ముఖం, పొత్తికడుపుపై పలు గాయాలయ్యాయి. జహిద్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన పరిస్ధితి విషమంగా ఉందని సమాచారం.
యూపీలో వీధి ఎద్దుల స్వైరవిహారాన్ని అరికట్టడంలో యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పలుమార్లు విమర్శులు గుప్పించారు. వీధి జంతువులు పొలాలను నాశనం చేయడమే కాకుండా హైవేలపై ప్రమాదాలకు దారితీస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.