అహ్మదాబాద్ : ప్రశాంత వాతావరణంలో చికిత్స అందిస్తూ రోగులకు స్వాంతన కలిగించాల్సిన బోధనాసుపత్రిలో భారీ శబ్ధాలతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, డీజే పార్టీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. కాలేజ్ ఫెస్ట్లో భాగంగా ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై గుజరాత్ వైద్యారోగ్య మంత్రి దర్యాప్తునకు ఆదేశించారు.
బీజే మెడికల్ కాలేజ్ విద్యార్ధులు, ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్లు కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా బుధవారం రాత్రి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వ్యాప్తితో గత రెండేండ్లుగా తాము కాలేజ్లో వార్షికోత్సవాలు జరపలేదని. మహమ్మారిపై పోరాటంలో తాము కష్టపడి పనిచేశామని, ఆ అలసట తీర్చుకునే క్రమంలో ఈసారి ఘనంగా కాలేజ్ ఫెస్ట్ నిర్వహించాలని నిర్ణయించామని రెసిడెంట్ డాక్టర్ రాహుల్ గమిట్ చెప్పుకొచ్చారు.
ఆస్పత్రి అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాతే పార్టీ నిర్వహించామని అన్నారు. బోధనాసుపత్రి కావడంతో కాలేజ్ క్యాంపస్లో పార్టీ నిర్వహించినా ఆస్పత్రిలో కూడా శబ్ధాలు వినిపించాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బోధనాసుపత్రిలో డీజే పార్టీ నిర్వహించడం పట్ల స్ధానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.