Cancer | న్యూఢిల్లీ, జనవరి 3: భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మారితో మరణించారని లాన్సెట్ తాజా అధ్యయనం పేర్కొన్నది. అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఆసియాలో రెండో స్థానంలో ఉన్నదని తెలిపింది. ఈ మేరకు అధ్యయన వివరాలు లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఆసియా జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆసియాలో భారత్తోపాటు చైనా, జపాన్లోనూ క్యాన్సర్ కోరలు చాస్తున్నదని అధ్యయనం పేర్కొన్నది. మొత్తంగా ఆసియాలో ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందని, 2019లో 94 లక్షల కొత్త కేసులు నమోదు కాగా, 56 లక్షల మంది మరణించారని పరిశోధకులు వెల్లడించారు.
టీబీఎల్ కేసులు, మరణాలు ఎక్కువ
పరిశోధకుల బృందంలో కురుక్షేత్ర ఎన్ఐటీ, జోధ్పూర్, బఠిండా ఎయిమ్స్లకు చెందిన వారు ఉన్నారు. 1990 నుంచి 2019 మధ్య 49 ఆసియా దేశాల్లోని 29 రకాల క్యాన్సర్ తీరుతెన్నులపై పరిశీలన చేశామని పరిశోధకులు అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ఆసియాలో టీబీఎల్(శ్వాసనాళం, ఊపిరితిత్తుల సంబంధిత) క్యాన్సర్ ప్రభావం అధికంగా ఉన్నదని, 13 లక్షల కొత్త కేసులు, 12 లక్షలు మరణాలు నమోదయ్యాయని వివరించారు. టీబీఎల్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నదని, మహిళల్లో గర్భాశయ సంబంధిత క్యాన్సర్ ముప్పు అధికంగా ఉన్నదని పేర్కొన్నారు. మొత్తంగా అసియాలో టాప్-5 క్యాన్సర్ల జాబితాలో టీబీఎల్, రొమ్ము క్యాన్సర్, సీఆర్సీ, పొట్ట సంబంధిత క్యాన్సర్, నాన్ మెలనోమా క్యాన్సర్ ఉన్నాయి. క్యాన్సర్కు కారణమయ్యే 34 రిస్క్ ఫ్యాక్టర్లలో పొగ, మద్యం తాగడం, కాలుష్యం ప్రధానంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
ప్రజారోగ్య ముప్పుగా పొగాకు ఉత్పత్తులు
భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఖైనీ, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్లోనే నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉన్నదని వెల్లడించారు. 2019లో ప్రపంచ నోటి క్యాన్సర్ మరణాల్లో 28.1 శాతం భారత్లో చోటుచేసుకోగా, ఈ విధమైన క్యాన్సర్ కొత్త కేసులు దేశంలో 32.9 శాతం రికార్డు అయ్యాయని తెలిపారు. 50 శాతం నోటి క్యాన్సర్ కేసులకు పొగాకు ఉత్పత్తులే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తుల(స్మోక్లెస్ టోబాకో) వల్ల నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా అన్నవాహిక, పాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
లక్షల్లో కేసులు.. మరణాలు
దేశం కొత్త కేసులు మరణాలు
చైనా ; 48 లక్షలు ;27 లక్షలు
భారత్ ; 12 లక్షలు ; 9.3 లక్షలు
జపాన్ ; 9 లక్షలు ; 4.4 లక్షలు