ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కిందట ముంబైలోని దహిసర్లో స్థానిక వ్యాపారవేత్త మారిస్ నోరోన్హా ఫేస్బుక్ లైవ్లో శివసేన (యూబీటీ) నేత అభిషేక్ ఘోసల్కర్పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఫిబ్రవరి 2న ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
కాగా, ఈ సంఘటనలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేత అభిషేక్ను కాల్చి చంపడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. షిండే ప్రభుత్వం గూండాలను కాపాడుతున్నదని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.