Amarnath Yatra | కొవిడ్ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కశ్మీర్కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వందలాది మంది సాధువులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో జమ్మూలో ఈ నెల 27 నుంచి ప్రయాణికుల టోకెన్ ప్రక్రియ ప్రారంభంకానున్నది. అలాగే 28 నుంచి తక్షణ రిజిస్ట్రేషన్ సదుపాయం అందుబాటులోకి రానున్నది. యాత్రలో భాగంగా మొదటి బ్యాచ్ 29న తెల్లవారు జామున జమ్మూలోని బేస్ క్యాంప్ భగవతి నగర్ నుంచి బయలుదేరనున్నది. సాంప్రదాయ బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో 30న అధికారికంగా మొదటి బ్యాచ్లో చేరనున్నది.
దాదాపు 400 మంది సాధువులు జమ్మూలోని శ్రీరామ మందిర పురాణి మండికి చేరుకున్నారు. 28 నుంచి ఆలయ ప్రాంగణంలో సాధువుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆలయ మహంత్ రామేశ్వర్ దాస్ పేర్కొన్నారు. అదేవిధంగా తత్కాల్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్య ప్రయాణికులు ముందుగా రైల్వే స్టేషన్ సమీపంలోని సరస్వతి ధామ్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టోకెన్లో కేటాయించిన స్థలం, తేదీ ప్రకారం తక్షణ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కేంద్రాల్లోనే భక్తులకు తక్షణ వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తామన్నారు. తత్కాల్ రిజిస్ట్రేషన్ కోసం ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరి స్పష్టం చేశారు.
టోకెన్ పొందిన తర్వాత, రూ. 220 రుసుము చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, సాధువులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ సమీపంలోని వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ, శాలమార్ వద్ద ప్రయాణికుల తక్షణ నమోదుకు ఏర్పాట్లు చేశారు. శ్రీరామ మందిరం పురాణీ మండి, గీతా భవన్ పరేడ్ వద్ద సాధువుల తత్కాల్ రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లు చేశారు. బేస్ క్యాంపు భగవతి నగర్లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 27న టోకెన్ను జారీ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ఏడీసీ సతీశ్ శర్మ తెలిపారు. న్వాన్ బేస్ క్యాంపులో అమర్నాథ్ యాత్ర కోసం ఆరోగ్య శాఖ బేస్ క్యాంపులో 15 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఇందులో కాన్సంట్రేటర్లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు.