న్యూఢిల్లీ, మే 23: దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని&ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం హై అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఒకేసారి రెండు విభిన్నమైన వాతావరణ పరిస్థితులను దేశం చూస్తున్నది. ఉత్తర భారతంలోని మైదాన ప్రాంతాలను తీవ్రమైన వడగాలులు దహించి వేస్తుండగా అనేక ఇతర ప్రాంతాలలో రుతు పవనాలకు ముందు జరిగే కార్యకలాపాలు తీవ్రమవుతున్నాయి.
రానున్న 12 గంటల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని 14 రాష్ర్టాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, పలు ఈశాన్య రాష్ర్టాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. డీహైడ్రేషన్, వడదెబ్బ, సంబంధిత అనారోగ్యాలతో బాధ పడుతున్న రోగుల సంఖ్య దవాఖానల్లో పెరిగినట్లు సమాచారం.