IMD : తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ క్రమంలో జూన్ 7న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో రానున్న 24 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షపు జల్లులు పడే వీలుందని అంచనా వేశారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.