monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ప్రకటించింది. పసిఫిక్ భూమధ్య రేఖ వద్ద ఎల్నినో బలపడటం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే జూన్లో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
1901 తర్వాత ఈ స్థాయిలో జూన్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఇది ఐదోసారి. అంటే 125 ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం నమోదైన ఐదు జూన్లలో ఇదీ ఒకటి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం జూలైలో దేశంలోని అనేక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. సెంట్రల్ ఇండియా, ఉత్తర భారత, తూర్పు భారత్ ప్రాంతాల్లో లోటువర్షపాతమే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉంది. వాయువ్య, తూర్పు-మధ్య, తూర్పు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దేశంలో లోటు వర్షపాతం ఉండటంతో వ్యవసాయ రంగంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సాగు 23 శాతం తగ్గినట్లు కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు కురవకపోవడంతో వరి, పప్పుధాన్యాలు, సోయాబీన్, పత్తి వంటి పంటలు ఎక్కువగా నాట్లు వేయలేదు.
వర్షాకాలంలో నాలుగు నెలల్లో జూన్, జూలైలలో తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. అయితే, ఆ తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆగష్టు, సెప్టెంబర్లలో మెరుగైన వర్షపాతం నమోదు కావొచ్చని ఆస్ట్రేలియాకు చెందిన వాతావరణ సంస్థ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ (బీఓఎం) తెలిపింది. కానీ, జూలైలో నమోదయ్యే వర్షపాతమే దేశంలో భారీ వర్షాలకు కారణమవుతుంది. వర్షాల లోటును తీరుస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. సాధారణ వర్షపాతమే నమోదవుతోంది.