చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు (heavy rainfall) ఇప్పట్లో వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రానికి పసుపు హెచ్చరికను (ఎల్లో అలర్ట్) జారీచేసింది. బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
ఈనెల 25, 26 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రోజున కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నవంబర్ 25న కోస్తా జిల్లాల్లో, నవంబర్ 26న పుదుచ్చేరి, కరైకల్, తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక శనివారం కూడా పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాని పేర్కొన్నది.