IMD Alert | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడురోజుల్లో 22 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు వాయువ్య, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని పేర్కొంది. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. గంగా, యమునా, ఘగ్గర్, హిండన్ సహా అన్ని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఉత్తరాఖండ్లోని నంద్ ప్రయాగ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో బద్రీనాథ్ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దాంతో యమున్రోతి రహదారి మంగళవారం సైతం మూతపడింది. అయితే కేదార్నాథ్ యాత్ర సాఫీగానే కొనసాగుతున్నది. హరిద్వార్లో గంగా నది 293.45 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నది.