న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ప్రధాని నరేంద్ర మోదీ సస్పెండ్ చేయరని, ఈ విషయం తనకు ఖచ్చితంగా తెలుసని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని ఆరోపించారు. ఈ విషయాన్ని తొలి రోజు నుంచి తాను చెబుతున్నానని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనంతో తొక్కించి రైతులను హత్య చేసిన కేసులో ఆరోపణలున్న ఆయనను సస్పెండ్ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అయితే రాబోయే యూపీ ఎన్నికల్లో ఆ కేంద్ర మంత్రికి చెందిన అగ్రవర్ణాల ఓట్లు కావాలి కాబట్టి ప్రధాని ఆ పని చేయరని, ఇది తనకు చాలా ఖచ్చితంగా తెలుసంటూ విమర్శించారు.